దేశంలో తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగి కన్నుమూత..అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

  • 106 ఏళ్ల వయసులో తుదిశ్వాస వదిలిన శ్యామ్ శరణ్ నేగి
  • అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఇటీవలే 34వ సారి ఓటేసిన నేగి
  • సంతాపం వ్యక్తం చేసిన సీఎం జైరాం ఠాకూర్ 
దేశంలో తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగి శనివారం కన్నుమూశారు. హిమాచల్ ప్రదేశ్ లోని తన స్వస్థలం కల్పలో 106 ఏళ్ల నేగి తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నేగి ఇటీవల పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. 106 ఏళ్ల వయసులో నేగి ఓటేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో స్పందించారు. ఆధునిక యువతకు నేగి స్ఫూర్తి అని ప్రధాని కొనియాడారు. కాగా, నేగి మృతిపై సీఎం జైరాం ఠాకూర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో పూర్తిచేయనున్నట్లు ప్రకటించారు.

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఈ నెల 12న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే! ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉపయోగించుకోవాలని అధికారులు నేగికి సూచించారు. అయితే, పోలింగ్ కేంద్రానికే వచ్చి ఓటేస్తానని నేగి వారికి స్పష్టం చేశారు. తర్వాత ఆరోగ్యం సహకరించకపోవడంతో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. ఈ సందర్భంగా వారు ఆయనను శాలువాతో సత్కరించారు.

స్వతంత్ర భారత తొలి ఓటరు..
స్వతంత్ర భారత దేశానికి 1951 లో జరిగిన ఎన్నికల్లో శ్యామ్ శరణ్ నేగి ఓటుహక్కును వినియోగించుకున్నారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఇప్పటి వరకు జరిగిన ప్రతీ ఎన్నికల్లో నేగి ఓటేశారు. ఇటీవల పోస్టల్ బ్యాలెట్ ద్వారా 34వ సారి నేగి ఓటుహక్కును వినియోగించుకున్నారు.

india first voter
negi
Himachal Pradesh
first voter death

More Telugu News